
హైదరాబాద్: జట్టులో అవకాశం దొరికినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే తన విధి అని స్పిన్నర్ రవీంద్ర జడేజా తెలిపాడు. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ మెరుగ్గా రాణిస్తుండటంతో గతేడాది కాలంగా పరిమిత ఓవర్ల జట్టుకి దూరంగా ఉంటున్న రవీంద్ర జడేజా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు.
ఓవల్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలి రోజు 24 ఓవర్లు వేసిన జడేజా 57 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమై... ప్రస్తుతం టెస్టు క్రికెట్కే పరిమితమైన రవీంద్ర జడేజా దీనిపై తాజాగా మాట్లాడాడు.
"భారత జట్టుకి ఆడటమే పెద్ద ప్రేరణ. జట్టులో అవకాశం దొరికినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే నా విధి. అలా చేయడం ద్వారా మళ్లీ మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నా. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతుంటే.. మ్యాచ్ల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటుంది" అని జడేజా అన్నాడు.
"ఆ గ్యాప్ నా కెరీర్కి ఉపయోగపడదు. కాబట్టి, నేను మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్లు ఆడేందుకు ప్రయత్నిస్తా" అని జడేజా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులో జడేజా చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే.