ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండో రోజు ఆటలో లంచ్ విరామానికి 222/3 స్కోరుతో టీమిండియా నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 119/1తో ఇవాళ ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. యశస్వీ జైశ్వాల్ (80; 74 బంతుల్లో) సెంచరీ చేజార్చుకున్నాడు. కాసేపటికీ గిల్ (23) కూడా ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అంత కఠినంగా లేదని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. సాధారణ రీతిలోనే స్పిన్కు అనుకూలిస్తుందని, బ్యాటర్లు పరుగులు చేసేలానే ఉందని అన్నాడు. కానీ ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడంలో విఫలమైందని తెలిపాడు.

'' పిచ్ స్పిన్కు అంత గొప్పగా అనుకూలించట్లేదు. సాధారణ స్పిన్లానే ఉంది. కానీ వికెట్ చాలా స్లోగా ఉంది. ఇది బ్యాటర్లకు కాస్త సవాలుగా ఉంటుంది. మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరుగులు సాధించవచ్చు. ఇక్కడ బౌలర్లకే అసలైన సవాలు. ఎందుకంటే లైన్ అండ్ లెంగ్త్లో కాస్త పొరపాటు చేసిన పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ ఎటాకింగ్ క్రికెట్ ఆడుతుందని తెలుసు. అయితే ఆ జట్టు బ్యాట్లర్లు ఎలాంటి షాట్లు ఆడతారనే విషయాలు ఆలోచించలేదు. లైన్ అండ్ లెంగ్త్పైనే ఫోకస్ చేశాను''
''ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడారు. దాని గురించి మేం ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అలా దూకుడుగా ఆడటం మాకే మంచిది అయ్యింది. వికెట్లను సాధించుకోగలిగాం. బెయిర్ స్టో వికెట్ విషయానికొస్తే.. ఆ బాల్ అద్భుతంగా వచ్చింది. అతడు ఎల్బీడబ్యూ తప్పించుకోవడానికి నాలుగో స్టంప్ స్థానంలోకి వచ్చి ఆడుతున్నాడు. కొన్ని కట్ షాట్లను వికెట్లకు దగ్గరగా ఆడుతున్నాడు. దీంతో వికెట్లకు బౌలింగ్ చేయాలనుకున్నా. ఆ బంతి గొప్పగా టర్న్ అయ్యింది'' అని అక్షర్ పటేల్ అన్నాడు.