టెస్టు ఫార్మాట్లో నిలకడగా పరుగులు సాధిస్తూ వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. కుమార సంగక్కరను అధిగమించి ఈ ఘనత అందుకున్నాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ రికార్డు నెలకొల్పాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921), రికీ పాంటింగ్ (13378), జాక్వెస్ కలిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288), అలెస్టర్ కుక్ (12472), జో రూట్ (12402), కుమార సంగక్కర (12400) పరుగులు చేశారు. రూట్ జోరు చూస్తుంటే ఈ జాబితాలో క్రమంగా రెండో స్థానానికి చేరుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. వచ్చే నెలలో అక్టోబర్లో పాకిస్థాన్తో జరగనున్న టెస్టు సిరీస్లో కుక్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమే.

ఇంగ్లండ్ అక్టోబర్లో పాకిస్థాన్తో మూడు టెస్టులు, నవంబర్-డిసెంబర్లో న్యూజిలాండ్తో మరో మూడు టెస్టులు ఆడనుంది. ఇక ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన లంక ప్రస్తుత ఆఖరి టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. విజయానికి 125 పరుగుల దూరంలో ఉంది.
ఓవర్నైట్ స్కోరు 211/5 తో మూడో రోజు ఆటను ఆరంభించిన లంక మొదటి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (69), కామిందు మెండిస్ (64) ఆట ప్రారంభంలోనే ఔటవ్వడంతో లంక త్వరగానే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ జేమి స్మిత్ (67) టాప్ స్కోరర్. లాహిరు కుమార నాలుగు, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) భారీ శతకం బాదాడు.