పాకిస్థాన్ వికెట్ కీపర్ అజామ్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టీ20లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్లో విఫలమై పాక్ ఓటమికి కారణమయ్యాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేగాక అతడు ఔటైన తీరుపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్క సన్నాహకంగా సాగిన నాలుగు టీ20ల సిరీస్ను పాకిస్థాన్పై ఇంగ్లండ్ 2-0 తేడాతో గెలిచి కైవసం చేసుకుంది.
గురువారం జరిగిన ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (38; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ అజామ్ (36; 22 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్స్టోన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలో రెండు వికెట్లు తీశారు. ఆర్చర్, జోర్డాన్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హారిష్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (45; 24 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ బట్లర్ (39; 21 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. బెయిర్ స్టో (28*; 16 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (17; 14 బంతుల్లో) పరుగులు చేశారు.
అయితే భారీకాయంతో ఉండే అజామ్ ఖాన్ ఈ మ్యాచ్లో ఘోర తప్పిదాలు చేశాడు. ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్ ఇచ్చిన సింపుల్ క్యాచ్లను వికెట్ల వెనుక చేజార్చాడు. ఫీల్డింగ్లో చురుకుగా ఉండట్లేదని కారణంతో మహ్మద్ రిజ్వాన్కు బదులుగా ఆజామ్ ఖాన్కు బాబర్ గ్లవ్స్ బాధ్యతలు అందించాడు. కానీ వికెట్ కీపింగ్లోనూ అజామ్ నిరాశపరిచాడు. అంతేగాక బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయిదు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మార్క్వుడ్ వేసిన రాకెట్ బంతిని అజామ్ అంచనా వేయడంలో విఫలమై ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ రాకెట్కు పాకిస్థాన్ కొండ నేలకూలిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.