
లాహోర్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కాక మీదున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఆరో టీ20లోచెలరేగాడు. అర్ధసెంచరీ చేశాడు. పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఈ ఓపెనర్- తాజాగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఇంతా చేసినప్పటికీ- జట్టును పరాజయం బారినుంచి కాపాడలేకపోయాడు బాబర్ ఆజం. లాహోర్లో జరిగిన ఆరో టీ20 ఇంటర్నేషనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లల్లో 169 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 59 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. టాప్ ఆర్డర్లో ఇఫ్తికర్ అహ్మద్ ఒక్కడే ఫర్వాలేదనిపించుకున్నాడు. 21 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లల్లో సామ్ కుర్రన్, డేవిడ్ విల్లే రెండు, రీస్ టోప్లే, రిచర్డ్ గ్లీసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని కొట్టిఅవతల పడేసింది. 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఏడు టీ20 మ్యాచ్ల ఈ సిరీస్లో 3-3తో సమవుజ్జీగా నిలిచింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపాడు. 41 బంతుల్లో మూడు సిక్సర్లు, 13 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. అలెక్స్ హేల్స్ 27, డేవిడ్ మలన్-26, బెన్ డక్కెట్ 26 పరుగులు చేశారు. రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ 170 పరుగులు చేసింది.
మ్యాచ్ పరాజయం పాలైనప్పటికీ- బాబర్ ఆజమ్ మాత్రం తన పేరు మీద కొత్త రికార్డును నెలకొల్పుకున్నాడు. విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేశాడు. 3,000 పరుగుల మార్కును అందుకోవడానికి విరాట్ కోహ్లీ 99 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. బాబర్ ఆజమ్ మాత్రం 81 ఇన్నింగుల్లోనే ఈ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, స్టిర్లింగ్, బాబర్ ఆజమ్ కంటే ముందుగా టీ20ల్లో 3,000 పరుగులు చేశారు.