సూపర్-8కు అర్హత సాధించాలంటే ఘన విజయం సాధించాల్సిన తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జూలు విదిల్చింది. శుక్రవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టి టీ20 ప్రపంచకప్లో ఆలస్యంగా బోణీ కొట్టింది. నెట్రన్రేటును గణనీయంగా పెంచుకుని -1.800 నుంచి +3.081కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టింది.
స్కాట్లాండ్తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇంగ్లండ్ సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. మిగిలిన రెండు మ్యాచ్లో కేవలం గెలవడమే కాకుండా, స్కాట్లాండ్(5 పాయింట్లు, +2.164 ) నెట్రన్రేటును అధిగమించేలా సత్తాచాటాలి. ఈ తరుణంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో 3.1 ఓవర్లలోనే రికార్డు ఛేదన చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. అదిల్ రషీన్ (4/11) నాలుగు వికెట్లతో, మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. అనంరం ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
టీ20 వరల్డ్ కప్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ఛేదన చేసిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఒమన్పై 101 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకోవడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2014 ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై లంక 90 బంతులు మిగిలుండగానే టార్గెట్ను సాధించింది. పదేళ్ల తర్వాత లంక రికార్డును ఇంగ్లండ్ తునాతునకలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (86 బంతులు, నమీబియాపై -2024), ఆస్ట్రేలియా (82 బంతులు, బంగ్లాదేశ్పై- 2021), భారత్ (81 బంతులు, స్కాట్లాండ్పై-2021) ఉన్నాయి.