
న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేకు కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం లండన్లో పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో అయిదు రోజుల పాటు అతను ఐసోలేషన్లో ఉండనున్నాడు. ఇక జూన్ 23 నుంచి 27వరకు హెడ్డింగ్లీలో ఇంగ్లాండ్తో జరగనున్న మూడోది మరియు చివరి టెస్ట్కు అతను అందుబాటులోకి వస్తాడో, రాడో అనే డైలామా కొనసాగుతుంది. కాన్వేతో పాటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్, ఇద్దరు సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. 'బుధవారం సాయంత్రం లండన్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్లో కాన్వేకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
అతనితోపాటు ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్, సహాయక సిబ్బంది విజయ్ వల్లభ్ (ఫిజియో), క్రిస్ డోనాల్డ్సన్ కూడా కరోనా బారిన పడ్డారు. వీరు ఐసోలేషన్లోకి వెళ్లనున్నారు.' అని న్యూజిలాండ్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది. ఇక వీరు చివరి టెస్ట్కు అందుబాటులోకి వస్తారని న్యూజిలాండ్ టీం మేనేజ్ మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. అందువల్ల కాన్వేకు, బ్రేస్వెల్కు బదులుగా మరో ప్లేయర్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొనలేదు.
ఇక ట్రెంట్ బిడ్జ్లో జరిగిన రెండో టెస్ట్కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఫలితంగా విలియమ్సన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని గైర్హాజరీలో జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్సీ వహించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ స్క్వాడ్లో కరోనా బారిన పడ్డ రెండో ఆటగాడు బ్రేస్ వెల్ కాగా.. తాజాగా డెవాన్ కాన్వే సైతం కరోనా బారిన పడ్డాడు.
ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో (136) సెంచరీతో టీ20 తరహాలో ఆడడంతో ఇంగ్లాండ్ 5వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. దాంతో మూడు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్ (3/94) దెబ్బకు.. ఒక దశలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 93/4తో నిలవడంతో మ్యాచ్ డ్రా చేసుకొనేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ బెయిర్స్టో వీరబాదుడుకు తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ (75 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది.