
ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ వీరోచితంగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే రెండో టెస్టు చివరి రోజు ముగిసిన మరుసటి రోజు అయిన బుధవారం న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల నిర్వహించిన కరోనా టెస్ట్లో అతనికి పాజిటివ్ అని తేలింది. మైఖేల్ బ్రేస్వెల్ రెండో టెస్ట్లో న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ 11లో ఉన్నాడు.
ఇక బ్రేస్వెల్ రెండో టెస్ట్లోనే న్యూజిలాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేయడం విశేషం. ఇక రెండో టెస్ట్కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఫలితంగా విలియమ్సన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని గైర్హాజరీలో జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్సీ వహించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ స్క్వాడ్లో కరోనా బారిన పడ్డ రెండో ఆటగాడు బ్రేస్ వెల్.
ఇక బ్రేస్వెల్ కరోనా బారిన పడ్డాడనే వార్త బయటకు రావడంతో న్యూజిలాండ్ స్క్వాడ్లోని మిగిలిన వాళ్లందరికీ మేనేజ్ మెంట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ను నిర్వహించింది. అతనితో పాటు ఉన్నవాళ్లెవరికీ కరోనా పాజిటివ్ అయితే రాలేదు. కరోనా వల్ల ఇక బ్రేస్వెల్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఇక జూన్ 23 గురువారం నుండి లీడ్స్లోని హెడింగ్లీలో జరిగే మూడోది మరియు చివరి టెస్ట్ మ్యాచ్కు అతను తిరిగి జట్టులో చేరే అవకాశముంది.
ఇకపోతే చివరి రోజు ఇంగ్లాండ్ 299పరుగుల లక్ష్యాన్ని 74ఓవర్లలో చేయాల్సి రాగా జానీ బెయిర్స్టో (136) సెంచరీతో టీ20 తరహాలో ఆడడంతో ఇంగ్లాండ్ 5వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. దాంతో మూడు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్ (3/94) దెబ్బకు.. ఒక దశలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 93/4తో నిలవడంతో మ్యాచ్ డ్రా చేసుకొనేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ బెయిర్స్టో వీరబాదుడుకు తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ (75 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది.