
లీడ్స్: బుధవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 151 పరుగులతో ఘన విజయం సాధించిన జట్టుతోనే బరిలోకి దిగుతామని చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తున్నామని.. అందుకే విన్నింగ్ కాంబినేషన్ను మార్చాలని అనుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం నుంచి హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్లో ఘన విజయం సాధించిన భారత్.. లీడ్స్ మ్యాచ్లోనూ గెలుపొంది సిరీస్లో దూసుకుపోవాలని చూస్తోంది.
మూడో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మూడో టెస్ట్ కోసం తుది జట్టును మార్చడానికి మాకు ఎటువంటి కారణం కనబడడడం లేదు. గత కొద్ది రోజులుగా తుది జట్టును ఎక్కువగా మార్చడం లేదు. బాగా విఫలమయిన ప్లేయర్ విషయంలో తప్ప.. ఎక్కువగా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తున్నా. ప్రస్తుతం జట్టులో అందరూ బాగా ఆడుతున్నారు. మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు' అని అన్నాడు.
ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ ప్లేయర్స్ వరుసగా దూరమవుతున్న విషయం తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందు పేసర్ జోఫ్రా ఆర్చర్ మరియు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తపుకున్నారు. తొలి టెస్టు తర్వాత వెటరన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గాయపడ్డాడు. లార్డ్స్ టెస్ట్ సమయంలో మార్క్ వుడ్ కూడా గాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం బలహీనంగా ఉంది కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'అది ప్రత్యర్థి బలం మీద ఆధారపడి ఉంటుంది. కీలక ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు కూడా మనం ఎవరినైనా ఓడించగలమని అనుకుంటాం. ప్రతిపక్షం బలహీనంగా ఉండే వరకు మేము వేచి ఉండము కదా' అని విరాట్ కోహ్లీ బదులిచ్చాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ శుభారంభాలతో గట్టి పునాదులు వేస్తున్నారు. క్రీజులో కుదురుకునే వరకు ఓపిగ్గా ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చుతున్నారు. లార్డ్స్ టెస్టులో ఈ ఇద్దరూ 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో కూడా ఓపెనింగ్ జోడి మంచి ఆరంభం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఇటీవలి కాలంలో ఫామ్ కొల్పోయిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్మన్లు చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు గాడిలో పడ్డారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పుజారా, రహానేలు 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి మళ్లీ లయ అందుకున్నారు. దీంతో లంక పర్యటన నుంచి వచ్చిన సూర్యకుమార్ యాదవ్కు జట్టులో చోటు లేకుండా పోయింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మూడో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడితే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. కోహ్లీ కూడా రెండో టెస్ట్ ద్వారా ఫామ్ అందుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అతడు కూడా పరుగులు చేస్తే.. భారత్ భారీ స్కోర్ చేస్తోంది. ఇక నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్ములాతోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడని సమాచారం. బ్యాటింగ్ చేయగల రవీంద్ర జడేజా వైపే కెప్టెన్ మొగ్గుచూపుతున్నాడట. దీంతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ కోసం పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదట. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మలనే కొనసాగించనున్నాడట. దీంతో ఫిట్నెస్ సాధించిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మూడో టెస్టులో ఆడే అవకాశం లేకుండా పోయింది. జడేజా వీలైనన్ని పరుగులు చేయాలని కోహ్లీసేన కోరుకుంటోంది. ఇక టెయిలెండర్లలో బుమ్రా, షమీ ఎలాంటి పరుగులు చేశారో అందరికీ తెలిసిందే. వారి భాగస్వామ్యంతో భారత్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.