
నాటింగ్హామ్: టీమిండియా బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ కూడా సరిసమానంగా దూసుకెళ్తోంది. రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా వ్యవహరించి పరుగులను అదుపుచేయడంతో పాటు చాకచక్యంగా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి టార్గెట్కు దూరంగానే ఉంచి మ్యాచ్ ముగిస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటన ఆరంభమైనప్పటి నుంచి బౌలింగ్ బలంగానే సాగుతోంది. అయితే భారత జట్టుకు నాలుగో టెస్టులో కష్టాలు తప్పవనిపిస్తోంది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో టెస్టులో ఆడేది అనుమానంగా మారింది.
అనారోగ్యం కారణంగా అతడు మూడో టెస్టులోనూ పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్టు కనిపించలేదు. ఆ మ్యాచ్లో పేసర్లు కీలకంగా నిలవడంతో అతడికి ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. పైగా చాలాసేపు మైదానం వీడాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అశ్విన్ ఈనెల 30 నుంచి సౌతాంప్టన్లో ప్రారంభమయ్యే తదుపరి మ్యాచ్లో ఆడే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అతడి ప్రాక్టీస్ను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఒకవేళ అశ్విన్ ఆడకపోతే తుది జట్టులో కచ్చితంగా స్పిన్నర్ను తీసుకోవాలనుకుంటే జడేజాకు చోటు దక్కే అవకాశాలున్నాయి. జడేజా ఇంగ్లాండ్ పర్యటనలో కొద్ది మ్యాచ్లు ఆడి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా సంపాదించాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్లోనూ మిగతా బ్యాట్స్మెన్ కంటే పరవాలేదనిపించాడు. భారత జట్టులో కేవలం ఒకే స్పిన్నర్ చాలనుకున్న నేపథ్యంలో జట్టు ఇప్పటివరకూ అశ్విన్కు మాత్రమే చోటిస్తూ వస్తుంది.
కానీ, నాల్గో టెస్టుకు అతని ఆరోగ్యం సరిపడకపోవడంతో అతని స్థానంలో జడేజాకు అవకాశం కల్పించొచ్చు. జట్టులో తొలి మూడు టెస్టులకు స్పిన్నర్గా వ్యవహరించిన కుల్దీప్ యాదవ్ను మూడో టెస్టులో మినహాయించారు. ఇతనితో పాటుగా మురళీ విజయ్ని సైతం పక్కకు తప్పించి పృథ్వీ షా.. హనుమ విహారీలను జట్టులోకి తీసుకన్నారు.