హైదరబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో సుదీర్ఘ టెస్టు సిరిస్కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో శిఖర్ ధావన్, ఛటేశ్వర పుజారా ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైస్ కెప్టెన్ రహానే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో విదేశీ గడ్డపై ధావన్ ప్రదర్శన నామమాత్రంగా ఉండటం, మరోవైపు పుజారా కూడా ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎసెక్స్ జట్టుతో ముగిసిన మూడు రోజులు వార్మప్ మ్యాచ్లో సైతం వీరిద్దరూ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తారని రహానే ధీమా వ్యక్తం చేశాడు.
తొలి టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రహానే మాట్లాడుతూ "ధావన్, పుజారా గురించి మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే వారిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. తిరిగి లయ అందుకొని తమని తాము నిరూపించుకోవడానికి వారికి ఒక్క ఇన్నింగ్ చాలు" అని అన్నాడు.
"ఇంగ్లాండ్తో ఆడటం ఎప్పటికీ సవాలుతో కూడుకున్న పనే. ఇలాంటి సమయంలో ఆటను ఆస్వాదిస్తూ... స్వేచ్ఛగా ఆడాలి. అంతేకానీ ఫలితం గురించే ఆలోచిస్తే మాత్రం అది కచ్చితంగా మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. వ్యక్తిగతంగా నా విషయానికొస్తే మాత్రం విదేశీ గడ్డలపై సవాళ్లను ఎదుర్కొంటూ ఆడటానికే ప్రాధాన్యతనిస్తా" అని రహానే అన్నాడు.