
హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్వల్ప వ్యవధిలో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కుర్రన్ తన అద్భుతమైన బౌలింగ్తో భారత్ టాపార్డర్ను కుప్పకూల్చాడు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 287 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర శామ్ కురన్ బౌలింగ్లో మురళీ విజయ్ ఎల్బీగా ఔటయ్యాడు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కుర్రన్ వేసిన బంతిని మురళీ విజయ్ ఎదుర్కొన్నాడు. వెంటనే బౌలర్ ఎల్బీగా అప్పీల్ చేసినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ రివ్యూ సాయం కోరాడు. రివ్యూలో మురళీ విజయ్(20) ఔట్గా తేలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతికే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించాడు.
అయితే, ఆ తర్వాత బంతికే కేఎల్ రాహుల్(4) బౌల్డయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లో కుర్రన్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న ధావన్(26) స్లిప్లో ఉన్న మలాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 50 పరుగులకు వికెట్ కోల్పోకుండా పటిష్ఠ స్థితిలో ఉన్న భారత్ 59 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది.
ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(9), రహానే(8) పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్ కుర్రన్కే మూడు వికెట్లు దక్కడం విశేషం.