బ్రిస్టల్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది. అయిదు వన్డేల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్లను ఆసీస్ గెలవగా, తర్వాతి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే హ్యాట్రిక్ విజయంతో సిరీస్ను కైవసం చేసుకోవాలనుకున్న ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఆశలకు వరుణుడు నీళ్లు చల్లాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బెన్ డకెట్ (107; 91 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (72; 52 బంతుల్లో, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఫామ్ కొనసాగిస్తూ మరోసారి సత్తాచాటాడు. సాల్ట్ (45; 27 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆదిల్ రషీద్ (36; 35 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ట్రావిస్ హెడ్ నాలుగు, జంపా, మాక్స్వెల్, హార్డ్లీ తలో రెండు వికెట్లు తీశారు.

పవర్ప్లేలోపే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయినా డకెట్-బ్రూక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మూడో వికెట్కు 132 పరుగుల భారీ భాగస్వామ్యాన్నినెలకొల్పారు. అయితే వీరిద్దరు ఔటైన అనంతరం ఇంగ్లండ్ స్కోరుబోర్డు నెమ్మదించింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. హెడ్ (4/28) ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయారు. అయినప్పటికీ ఇంగ్లండ్ 300+ స్కోరు సాధించింది.
అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 20.4 ఓవర్లలో రెండు వికెట్లకు 165 పరుగులు చేసింది. అయితే ఈ దశలో వరుణుడు ఎంట్రీ ఇచ్చారు. తొలుత జల్లులా ప్రారంభమై తర్వాత భీకర వర్షం పడింది. మ్యాచ్ను కొనసాగించే పరిస్థితి వీలు కాలేదు. మరోవైపు ఆ సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల ముందంజలో ఉంది. దాంతో ఆసీస్ను విజేతగా నిర్ణయించారు. ఆఖరి వరకు పోరాడి మ్యాచ్ గెలుద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలకు వరుణుడు నీళ్లు చల్లాడు.
అయితే ఛేదనను ఆస్ట్రేలియా దూకుడుగా ఆరంభించింది. మాథ్యూ షార్ట్ (58; 30 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) 27 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ట్రావిస్ హెడ్ (31; 26 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించడంతో పవర్ప్లేలో ఆసీస్ 103 పరుగులు చేసింది. అయితే ఈ ఓపెనర్లను ఇంగ్లండ్ బౌలర్లు పెవిలియన్కు పంపించిన తర్వాత ఆస్ట్రేలియా స్కోరుబోర్డు నెమ్మదించింది. స్టీవ్ స్మిత్ (36 నాటౌట్; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), జోస్ ఇంగ్లిష్ (28 నాటౌట్; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ వరుణుడు ఎంట్రీతో మ్యాచ్ పూర్తిగా సాగలేదు.