ENG vs AUS: సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆకాశం మేఘావృతం కావడం, వెలుతురు సరిగా లేకపోవడంతో కేవలం 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు పటిష్టి స్థితిని అందించారు.
జో రూట్, హ్యారీ బ్రూక్ అజేయ భాగస్వామ్యం
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జో రూట్ 103 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇది ఆయన కెరీర్లో 67వ హాఫ్ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (68 హాఫ్ సెంచరీలు) రికార్డుకు ఆయన కేవలం అడుగు దూరంలో ఉన్నారు. హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతూ 92 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. టాపార్డర్ త్వరగా నిష్క్రమించినా, వీరిద్దరూ కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.

నిరాశపరిచిన టాపార్డర్
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. బెన్ డకెట్ (27), జాక్ క్రాలీ (16), జాకబ్ బెథెల్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మైఖేల్ నెసెర్, స్కాట్ బోలాండ్ తలో వికెట్ తీశారు.
138 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి
సిడ్నీ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు సహకరిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్క స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగారు. సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ లేకుండా ఆడటం గత 138 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం ఆస్ట్రేలియాకు ఎంతవరకు కలిసివస్తుందో వేచి చూడాలి.
వాతావరణం అంతరాయం
టీ విరామానికి ముందే సిడ్నీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో ఫ్లడ్ లైట్ల వెలుతురు కూడా సరిపోలేదు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేసి, వెలుతురు మెరుగుపడకపోవడంతో తొలి రోజు ఆటను ముగించినట్లు ప్రకటించారు. ఐదు టెస్టుల ఈ యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్, ఈ చివరి టెస్టులోనూ విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.