న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్పై ఇంగ్లాండ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఆప్ఘన్ బ్యాట్స్మెన్లు చతికలపడ్డారు.
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్మెన్లలో మహ్మద్ షెహజాద్ (4), నూర్ అలీ జద్రాన్ (17), రషీద్ ఖాన్ (15), మహ్మద్ నబీ (12) పరుగులు చేయగా ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సమీ షెన్వారీ (22), షఫాక్ (35) కాస్తంత ఫర్వాలేదనిపించారు.

నిలకడగా ఆడి అఫ్గానిస్థాన్ బ్యాట్స్మెన్లు గెలుపు ఆశలు రేపినా బంతులు, పరుగుల మధ్య ఎక్కువ దూరం పెరిగిపోవడంతో ఒత్తిడిలో బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ, రషీద్, రెండు వికెట్లు తీసుకోగా జోర్డాన్, అలీ, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ గెలుపుతో ఇంగ్లాండ్ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకోగా.. అఫ్గానిస్థాన్ మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆరంభంలోనే తడబడ్డారు.
ఆప్ఘనిస్ధాన్ బౌలర్ల ధాటికి ఆరంభంలోనే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 8 ఓవర్లకే కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది. 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్లు మన్రూట్ (12), కెప్టెన్ మోర్గాన్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

జేమ్స్ విన్సె (22), జో రూట్ (12), స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన అలీ 41, వైలీ 20 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు స్కోరుని ముందుకు నడిపించారు. చివరి రెండు ఓవర్లలో దూకుడుగా ఆడి ఎనిమిదో వికెట్కి 5.3 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు రాబట్టారు.
చివర్లో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ మోయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్) రాణించడంతో అఫ్ఘానిస్థాన్కు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో మహ్మాద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఆమిర్ హంజా, సముల్లా సేన్వారి చెరో వికెట్ తీసుకున్నారు.