
హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా యువీ తన అధికారిక ఫెస్బుక్ పేజీలో ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోని నాయకత్వంలో టీమిండియా సాధించిన రెండు వరల్డ్కప్ల్లోనూ యువీ కీలకపాత్ర పోషించాడు.
భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువరాజ్ 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్లాడి 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్లాడిన యువీ 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.
సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్కప్లో ఆల్రౌండర్గా అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. తన రిటైర్మెంట్ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పాడు.
"క్రికెట్ నాకు జీవితంలో అన్నీ ఇచ్చింది, అందుకే అదంటే ఇష్టం. అదే సమయంలో మానసికంగా తనను ఎంతో క్షోభకు గురిచేసిందని, అందుకే అదంటే నాకు అసహ్యం(నవ్వుతూ). నేను సక్సెస్ సాధించిన దానికంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యా. నా దేసం తరుపున ఆడటం కోసం రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం" అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు.
"2000లో నా కెరీర్ను ఆరంభించాను. 19 ఏళ్లు పూర్తయ్యాయి. నా కెరీర్ను ఎలా ముగించాలనే గందరగోళంలో ఉండేవాడిని. ఈ ఏడాది ఐపీఎల్లో ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉంటే నాకు ఇంకాస్త సంతృప్తిగా ఉండేది. ఆ సంతృప్తితో క్రికెట్ నుంచి వెళ్లిపోయేవాడిని. అయితే జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా. 2019 ఐపీఎలే నాకు చివరిది అని గతేడాదే నిర్ణయించుకున్నా" అని యువీ అన్నాడు.
"ఇకపై ఐపీఎల్కు నేను అందుబాటులో ఉండను. బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నా. నా జీవితంలో అత్యంత చెత్త రోజు అదే. 2014లో వరల్డ్ టీ20 శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్. ఆ రోజే అనుకున్నా.. నా కెరీర్ ముగిసిందని. క్రికెట్ నాకు ఎంతో మంది సీనియర్స్తో పాటు స్నేహితులను ఇచ్చింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో నా కెరీర్ ఆరంభమైంది" అని యువీ తెలిపాడు.
"నా ఐడల్ సచిన్ టెండూల్కర్, లెజెండరీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, జవగళ్ శ్రీనాథ్, ధోని నాయకత్వంలో 2011 వరల్డ్ కప్ గెలవడం. నా క్రికెట్ జీవితం ఓ అందమైన కథ అని, అది ముగింపు దశకు చేరుకుంది" అని చెబుతూ యువరాజ్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.
"నా తండ్రి యోగ్రాజ్ సింగ్ నాకు తొలి గురువు. మా ఇద్దరి రిలేషన్ షిప్ చాలా వెరైటీగా ఉండేది. పదేళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లవాడిలా పరిగెత్తించేవాడు. కష్ట సమయాల్లో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు" అని యువరాజ్ తెలిపాడు. "సెలక్టర్లు, సౌరవ్ గంగూలీకి ధన్యవాదాలు. ముఖ్యంగా చందు బోర్డే, టీఏ శేఖర్ మరికొంతమందికి. ఇదే ఖచ్చితమైన రోజు" అని యువీ అన్నాడు.
"బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే భారత్ బయట టీ20 లీగుల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నా. ఈ వయసులో ఎంజాయ్ చేస్తూ ఆడే టోర్నీల్లో అయితేనే ఆడగలను అనిపిస్తుంది. అంతర్జాతీయ కెరీర్ గురించి ఆలోచించుకుంటూ ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అందుకే బీసీసీఐ అనుమతితో విదేశాల్లో టీ20 లీగ్లు ఆడాలని ఉంది" అని యువీ చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ రిటైర్మెంట్పై తండ్రి యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ "యువీ ఆటను చూస్తే నాకు గ్యారీఫీల్డ్ సొబెర్స్, వీవీ రిచర్డ్స్లు గుర్తొచ్చేవారు. కచ్చితమైన షాట్లు, టైమింగ్తో యువీ ఎన్నో సార్లు నన్ను ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్లో యువీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నాడు.