హైదరాబాద్: కటక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొలి వన్డేలో నిరాశపరిచిన యువరాజ్ సింగ్ రెండో వన్డేలో చెలరేగి ఆడాడు. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులో దిగిన యువీ 98 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్ ప్లంకెట్ వేసిన 33 ఓవర్ చివరి బంతికి అతడు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధోనితో కలిసి నిలకడగా ఆడుతూ సెంచరీని నమోదు చేశాడు. తన అసలైన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసిన యువీ సెంచరీ అనతంరం కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు.
బ్యాట్ను డ్రెస్సింగ్ రూమ్ కేసి చూపించి తనలో పోరాట పటిమ ఇంకా తగ్గలేదు అన్నట్లుగా చూశాడు. ఇదిలా ఉంటే యువీ సెంచరీ తర్వాత అవతలి ఎండ్లో ఉన్న ధోని వెంటనే వచ్చి యువీని అభినందించాడు. ఈ సందర్భంలోతన కెరీర్లో 14వ సెంచరీ టేసిన యువీ కళ్లలో భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు కనిపించాయి.
రెండో వన్డేలో 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. జట్టు స్కోరు 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు.
రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సెంచరీ సాధించాడు. 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చేసిన తొలి సెంచరీ ఇదే. తన వన్డే కెరీర్లో 10వ సెంచరీ నమోదు చేశాడు.