దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మధ్య ఉన్న స్నేహం గురించి క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. ధోనీ వారసుడిగా గ్లవ్స్ బాధ్యతలు అందుకున్న పంత్కు మహీ మార్గనిర్దేశకం చేస్తూ ఉంటాడు. అలాగే ఖాళీ దొరికిన సందర్భాల్లో ధోనీ కుటుంబంతోనే పంత్ తన సమయాన్ని గడుపుతుంటాడు. అయితే వీరిద్దరి బాండింగ్ గురించి తెలియజేసేలా ఓ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆ ఫొటోలో కన్నీటిని ఆపుకుంటూ ఉన్న పంత్ను ధోనీ ఓదారుస్తున్నాడు. తన మాటలతో పంత్ మూడ్ను ఛేంజ్ చేసేలా ధోనీ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పంత్ సోదరి సాక్షి నిశ్చితార్థంలో తీసిన ఫొటో ఇది. హిందూ వివాహ సంప్రదాయంలో అప్పగింతలు ఆఖరి ఘట్టంగా ఉంటుంది. ఇష్టంతో పెళ్లి చేస్తున్నా విడిపోతున్నామనే బాధ అమ్మాయి కుటుంబంలో కనిపిస్తుంటుంది. పంత్ కూడా తన సిస్టర్ను మిస్ అవుతానని బాధలో కనిపించాడు.
మరోవైపు పంత్ తల్లి ధైర్యంగానే ఉంటూ కనిపించారు.

తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నఅంకిత్ చౌదరీతో సాక్షి పంత్ జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తమ లవ్ స్టోరీలో మరో కొత్త ఛాప్టర్ మొదలైందని సాక్షి ప్రకటించింది. సాక్షి, అంకిత్ లండన్లో నివసిస్తున్నారు. అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అంకిత్ లండన్కి వెళ్లి స్థిరపడ్డాడు.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. 2022 డిసెంబర్లో పంత్ కారు ప్రమాదానికి గురై ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నడవడానికే కష్టపడిన పంత్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో కచ్చితంగా బరిలోకి దిగుతానని సంకేతాలు పంపుతున్నాడు. తాజాగా పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా పంత్ ఐపీఎల్ ఆడతాడని తెలిపాడు. అయితే వికెట్ కీపింగ్, కెప్టెన్సీ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు ధోనీ కూడా ఐపీఎల్ కోసం సాధన మొదలుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితుడు పరమ్జిత్ సింగ్కు చెందిన కంపెనీ 'ప్రైమ్ స్పోర్ట్స్' స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ షురూ చేశాడు. ధోనీ కెరీర్ ప్రారంభంలో పరమ్జిత్ ఎంతో సాయంపడ్డాడు. ధోనీ బయోపిక్ సినిమా 'ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ'లో వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చక్కగా తెరకెక్కించారు. కాగా, వచ్చే సీజన్లో ధోనీ జెర్సీని చెన్నై సూపర్ కింగ్స్ గురువారం విడుదల చేసింది.