కోల్కతా: ప్రపంచ ట్వంటీ 20 కప్ గెలిచిన అనంతరం విండీస్ కెప్టెన్ డారెన్ సామి ఎమోషనల్ అయ్యాడు. చిరకాలం ఈ విజయం యొక్క ఆనందం గుర్తు ఉంటుందని, మాతోనే ఉంటుందని చెప్పారు. మేం అసలు టోర్నీ ఆడతామో లేదో అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారన్నాడు.
బోర్డు మమ్మల్ని అగౌరవపరిచిందని, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ మమ్మల్ని బుర్ర లేనివాళ్లని తిట్టాడని, సమస్యలన్నీ పక్కనబెట్టి తామంతా ఒక్కటయ్యామని, ఇది అద్భుతమని చెప్పాడు. దుబాయ్లో శిక్షణ శిబిరంలో ఉన్నప్పుడు తమకు కనీసం జెర్సీలు కూడా సిద్ధమవ్వలేదన్నాడు.
మేనేజర్ రాల్ లూయిస్ పడ్డ కష్టం తమకు తెలుసునని, దేశ అధ్యక్షుల నుంచి సందేశాలొచ్చాయి కానీ, మా బోర్డు మాత్రం పంపలేదన్నాడు. ఈ రాత్రి మనసారా సంబరాలు చేసుకుంటామని, మరోసారి వెస్టిండీస్కు ఆడతానో లేదో తెలియదని, కరేబియన్లు ఛాంపియన్లను అందరికీ తెలుసునని చెప్పాడు.

మొదట భగవంతుడికి తన కృతజ్ఠతలు అని చెప్పాడు. జట్టుకు కొత్త మేనేజర్గా లూయిస్ను ఎంపిక చేశారని, ఆయన చాలా కష్టపడ్డారని, మేం కోల్కతా చేరుకొని.. మొదటి మ్యాచుకు సిద్ధమయ్యే సమయానికి ఆయన మా జెర్సీలతో తిరిగి వచ్చాడని చెప్పాడని ఎమోషనల్ అయ్యాడు.
ఎవరు ఏమన్నా మేం ఓర్చుకున్నామని, కోచింగ్ స్టాఫ్ మా వెంటే ఉన్నారని, కరేబియన్ పెద్దలు నిత్యం తమకు ఫోన్ చేసి ఉత్సాహపరిచారని చెప్పాడు. మెయిల్స్, సందేశాలు పెట్టారన్నాడు. ఫైనల్ మ్యాచ్ రోజున ఉదయం గ్రెనడా నుంచి కరేబియన్ ప్రధాని కీత్ మిచెల్ తనతో మాట్లాడారని చెప్పాడు.
విండీస్ క్రికెట్ ఒకరో, ఇద్దరి ఆటగాళ్ల మీద ఆధారపడేది కాదని చెప్పాడు. తమ జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లేనని చెప్పాడు. భవిష్యత్తులో మేం కలిసి ఆడొచ్చు.. ఆడకపోవచ్చు కానీ ఈ విజయం మా అందరికీ చిరస్మరణీయమైనదని చెప్పాడు.
సామి కంటతడి పెట్టినట్లుగా మాట్లాడాడు. సామి ఎమోషనల్ స్పీచ్కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. 'సామీ.. నీ కన్నీరు వృథా కావొద్దు' అని అభిమానులు కోరారు.
విండీస్పై సచిన్ ప్రశంసలు
విండీస్ విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత్ మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'బ్రాగ్ వైట్ వాజ్ బ్రీత్ టేకింగ్' అంటూ అతడిని సచిన్ అభివర్ణించారు. అండర్-19, మహిళలు, పురుషులు... మూడు విభాగాల్లో విండీస్ విజేతగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించిన సచిన్... ఆ దేశ జట్ల ఆట తీరు అద్భుతమంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, విండీస్ బోర్డు ఆటగాళ్లకు మద్దతవ్వాలని మరో ట్వీట్ చేశాడు.