ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఒమన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బీ టేబుల్ టాపర్గా లీగ్ దశను ముగించింది. శుక్రవారం జరగనున్న సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్తో తలపడనుంది. అదే రోజు జరగనున్న మరో సెమీస్లో పాకిస్థాన్తో శ్రీలంక పోటీపడనుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 140 పరుగులు చేసింది. మహమ్మద్ నదీమ్ (41; 49 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ హమద్ మిజ్రా (28 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అకిబ్ ఖాన్, రసిక్ సలామ్, నిశాంత్ సింధు, రమన్దీప్ సింగ్, సాయి కిశోర్ తలో వికెట్ తీశారు.

ఒమన్ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వసీమ్ అలీ (24; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి మహమ్మద్ నదీమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. నాలుగో వికెట్కు 47 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ ఈ జోడీ దాటిగా ఆడలేకపోయింది. కాగా, అనంతరం ఛేదనకు దిగిన భారత్-ఏ 15.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
ఆయుష్ బదోని (51; 27 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం సాధించాడు. అభిషేక్ శర్మ (34; 15 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఛేదనలో ఆదిలోను అనుజ్ రావత్ (8; 11 బంతుల్లో) వికెట్ను భారత్ కోల్పోయింది. కాసేపటికే అభిషేక్ కూడా ఔటవ్వడంతో 43 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (36 నాటౌట్; 30 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మూడో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బదోని ఔటైనప్పటికీ తిలక్ ఆఖరి వరక క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.