

హైదరాబాద్: జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ని 'మన్కడింగ్' ఔట్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్పై రాజస్థాన్ రాయల్స్ మెంటార్ షేన్వార్న్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జోస్ బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లో అశ్విన్ తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్మెన్ని ఔట్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా అశ్విన్ అనైతికంగా వ్యవహరించడంపై మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం విమర్శలు చేస్తున్నారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది.
తాజాగా ఆస్ట్రేలియా స్పన్ లెజెండ్ షేన్వార్న్ సైతం అశ్విన్ 'మన్కడింగ్' ఔట్పై మండిపడ్డాడు. కెప్టెన్గా, వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని షేన్ వార్న్ పేర్కొన్నాడు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్లో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు.

ఆ సమయంలో అశ్విన్కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్ను రనౌట్ చేశాడని.. దాన్ని డెడ్బాల్గా పరిగణించాల్సి ఉండేదని వార్న్ తెలిపాడు. ఐపీఎల్లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసికస్థితిని చెడగొడుతుందని, క్రికెట్లో అన్నిటి కంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని తెలిపాడు.
భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్ వార్న్ సూచించాడు. అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్ వార్న్ తన మరో ట్వీట్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.