హైదరాబాద్: సాధారణంగా క్రికెట్ మ్యాచ్లకు వర్షం అంతరాయ కలిగిస్తుంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అప్పుడప్పుడు తేనేటీగలు మ్యాచ్కి అడ్డంకి సృష్టించడాన్ని కూడా మనం చూశాం. అయితే తాజాగా శ్రీలంకలోని ఓ స్టేడియంలోకి ఎక్కడ ఏనుగులు ప్రవేశించి మ్యాచ్కి అంతరాయం కలిగిస్తాయోనని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది.
వివరాల్లోకి వెళితే... శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సూచన మేరకు 2009లో అటవీ సమీప ప్రాంతమైన హంబన్తోటలో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 35 వేలు. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 17 మ్యాచ్లు మాత్రమే నిర్వహించారు.
ఈ స్టేడియానికి అతి సమీపంలో ఏనుగు అభయారణ్యం ఉండటం ఓ కారణంకాగా, పట్టణానికి దూరంగా ఉండటంతో మ్యాచ్ నిర్వహణ వ్యయం, అభిమానుల ఆదరణ లేకపోవడంతో ఇక్కడ మ్యాచ్లను నిర్వహించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
జింబాబ్వే జట్టు ఐదు వన్డేల కోసం శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో చివరి మూడు వన్డేలను హంబన్తోటలోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో గురువారం మూడు వన్డే, శనివారం నాలుగు, సోమవారం ఐదో వన్డే అక్కడ జరగనుంది.
ఈ క్రమంలో స్టేడియానికి 100 మీటర్ల దూరంలో అటవీ ప్రాంతం ఉండటంతో రాత్రి పూట అడవి ఏనుగులు అక్కడికి వచ్చి పిచ్ని ఎక్కడ పాడు చేస్తాయోనని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. దీంతో పిచ్ రక్షణాత్మక చర్యలు ప్రారంభించామని, మ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అటవీ శాఖ అధికారులు భరోసా ఇచ్చారు.
హంబన్తోటలో జరిగే మ్యాచ్లకు ఏనుగులు అంతరాయం కలిగించడం ఇదే మొదటిసారి కాదు. స్టేడియానికి 240 కిలోమీటర్ల దూరంలో సుమారు 25 అడవి ఏనుగులు ఇలా తిరుగుతూనే ఉంటాయని స్ధానికులు చెబుతున్నారు. చివరిసారిగా ఈ స్టేడియంలో రెండేళ్ల క్రితం ఓ వన్డే జరిగింది.