బెట్టింగ్ యాప్ కేసు, సహారా గ్రూప్ అంబీ వ్యాలీ ప్రాజెక్ట్లోని రూ. 300 కోట్ల ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 22న రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని వారికి నోటీసులు అందాయి. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలు పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని తేలడంతో నోటీసులు అందాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ తో కేసు ముడిపడి ఉన్నందున మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది. మనీలాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు సోనూ సూద్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనను సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది.

ఇదిలా ఉండగా.. గతంలో శిఖర్ ధావన్, సురేష్ రైనాలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు వారిద్దరిని ఈడీ విచారించింది. వీరు ఎందుకు ఈ యాప్ను ప్రచారం చేశారు, వారికి ఎంత డబ్బు లభించింది, యాప్తో వారికి ఉన్న సంబంధాలు ఏమిటి అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఇదే కేసులో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలను కూడా ఈడీ విచారించనుంది. ఈ కేసులో క్రికెటర్ల ప్రమేయంపై మరింత సమాచారం కోసం ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విచారణల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.