
లండన్: ఇంగ్లండ్ క్రికెట్లో పాత ట్వీట్ల దుమారం కొనసాగుతోంది. గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లను చిక్కుల్లో పడేశాయి. ఆరంగేట్ర పేసర్ ఒలీ రాబిన్సన్ 8 ఏళ్ల కిందట చేసిన జాతి వివక్ష ట్వీట్లను సీరియస్గా తీసుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. అతని ట్వీట్స్పై విచారణ కూడా ప్రారంభించినచింది. ఈ క్రమంలో పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను ఈసీబీ వెలికితీస్తోంది.
ఒలీ రాబిన్సన్ పాత ట్వీట్లపై విచారణ కొనసాగుతుండటం.. మరోవైపు జాత్యాహంకార వ్యాఖ్యల్ని అస్సలు సహించబోమని ఈసీబీ వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన ఇంగ్లండ్ క్రికెటర్లు భయాందోళనలో ఉన్నారు. దీంతో తమ పాత ట్వీట్లను తొలగించే పనిలో పడ్డారు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 11 ఏళ్ల క్రితం తన సహచర ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ని '15 ఏళ్ల లెస్బియన్'గా అభివర్ణించిన ట్వీట్ని డిలీట్ చేశాడు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 'సర్' అంటూ పరోక్షంగా ఇండియన్స్ను ఎగతాళి చేస్తూ మూడేళ్ల క్రితం పెట్టిన ట్వీట్లను డిలీట్ చేశాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా 'సర్' పదాన్ని వినియోగిస్తూ అప్పట్లో చేసిన ట్వీట్లను తాజాగా డిలీట్ చేశాడు.
ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ గతంలో ఇండియన్స్ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చాయి. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారని సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. జేమ్స్ అండర్సన్పైనా విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే తన ట్వీట్లపై అండర్సన్ స్పందిస్తూ.. ఎప్పుడో పదేళ్ల కిందట అలా చేశానని, ఇప్పుడు తానో వ్యక్తిగా మారిపోయానని, తప్పులు జరుగుతూనే ఉంటాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జాతి వివక్ష ట్వీట్ల గొడవ వీరితో ఆగుతుందా?, ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాలి.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టులో రూట్ సేన ఆశించినంత మేర ఆకట్టుకోలేకపోయింది. భారత్ జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. ఆపై ఇంగ్లండ్ జట్టు టీమిండియాతో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.