మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బట్లర్ సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని మంగళవారం వెల్లడించింది. ప్రమాదకర బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయాలు కారణంగా దాదాపు ఏడాది ఆటకు దూరమైన అతడు ప్రపంచకప్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
మరోవైపు గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరమైన క్రిస్ జోర్డాన్ను కూడా ఇంగ్లండ్ బోర్డు ఎంపిక చేసింది. బట్లర్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, జానీ బెయిర్స్టోలకు టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా అవకాశం ఇచ్చింది. ఎడమచేతి వాటం బ్యాటర్లు బెన్ డకెట్, మొయిన్ అలీని కూడా బ్యాటింగ్ లైనప్లో చోటిచ్చింది. లోయర్ ఆర్డర్లో హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్, సామ్ కరన్ను ఎంపిక చేసింది.

అయితే వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమే పాకిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుందని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మే 22 నుంచి పాకిస్థాన్తో ఇంగ్లండ్ నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఎంపికైన ఆటగాళ్లు సిరీస్ ప్రారంభమయ్యే రెండు రోజుల ముందే భారత్ను వీడాలని ఈసీబీ స్పష్టం చేసింది. దీంతో మే 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లండ్ ప్లేయర్లు అధికారికంగా దూరం కానున్నారు.
పాకిస్థాన్తో సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ మే 31న కరేబియన్ దీవులకు బయలుదేరనుంది. జూన్ 4న బార్డబోస్ వేదికగా స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లండ్ గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ దేశాలతో తలపడనుంది.
ఇంగ్లండ్ జట్టు: బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హర్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.