
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మిగతా సీజన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడబోరని ఆ జట్టు ఇంటర్నేషనల్ షెడ్యూల్ మెనేజింగ్ డైరెక్టర్ ఆశ్లే గిల్స్ స్పష్టం చేశారు. లీగ్ జరిగే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ ఉంటే.. కాంట్రాక్టు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడరని ఆష్లే గైల్స్ అన్నారు. అక్టోబర్ నెలలో ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుందని ఆయన చెప్పారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ పరిస్థితి భిన్నమని ఆశ్లే గిల్స్ వివరించారు. 2021 సీజన్లో షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. జట్లలో కరోనా కేసులు నమోదవడంతో 29 మ్యాచ్లు ముగియగానే టోర్నీని బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2021లో 29 మ్యాచులు ముగిశాక కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. చెన్నై కోచులు లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ వైరస్ బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ గత మంగళవారం లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే మిగిలిన 31 మ్యాచులు నిర్వహించేందుకు సరైన సమయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. బహుశా టీ20 ప్రపంచకప్ ముందు సెప్టెంబర్, అక్టోబర్లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
'ఇంగ్లండ్ జట్టు షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్తో సిరీస్లు ఆడితే.. ఐపీఎల్ 2021 సీజన్లో మా క్రికెటర్లు ఆడతారని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ షెడ్యూలు ఉంటుంది కాబట్టి ఆటగాళ్లు ఆ సిరీసులే ఆడతారని అనుకుంటున్నా. ఆటగాళ్లు ఇంగ్లండ్ మ్యాచులే ఆడేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం' అని ఈసీబీ ఎండీ ఆష్లే గైల్స్ తెలిపారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో అంతకముందు ఈసీబీ పాకిస్థాన్, బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ సిరీస్ల్లో తలపడనుంది. ఐపీఎల్ 2021 మిగతా సీజన్లకు ఇంగ్లీష్ ఆటగాళ్లు దూరమయితే.. కోల్కతా, రాజస్థాన్, చెన్నై జట్లకు షాక్ తగలనుంది.
ఐపీఎల్ 2021 మొదలైనప్పుడు జూన్ 2న ఆరంభమయ్యే న్యూజిలాండ్ టెస్టు సిరీసులో ఆటగాళ్లు ఆడరని ఆష్లే గైల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 'న్యూజిలాండ్ సిరీస్ నేపథ్యం వేరు. జనవరి చివర్లో ఆ షెడ్యూలును ఖరారు చేశాం. కానీ పూర్తి ఐపీఎల్ ఆడేందుకు అప్పటికే ఆటగాళ్లు ఒప్పందం చేసుకున్నారు' అని గైల్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం పది రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు వెంటనే జట్టులో చేరేందుకు తొందరేమీ లేదన్నారు. ఆడబోయే క్రికెట్ను బట్టి ఎక్కువ మంది ఆటగాళ్లతో బృందాలను ఏర్పాటు చేస్తామని ఈసీబీ ఎండీ స్పష్టం చేశారు. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, సామ్ కరన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్దాన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ తదితరులు ఐపీఎల్ 2021 ఆడారు.