మెల్బోర్న్: వచ్చేడాది పర్యటనలో టీమిండియాతో కచ్చితంగా డే/నైట్ టెస్టు ఆడుతాం అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ ధీమా వ్యక్తం చేసాడు. టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశముంటే వారిని డే/నైట్ టెస్టుకు ఒప్పించడం కష్టమేమీ కాదు అని ఆయన అంటున్నాడు. గతేడాది కోహ్లీసేన ఆసీస్ గడ్డపై పర్యటించిన విషయం తేగలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్తో పంత్ డేటింగ్?.. ఎవరా భామ!!
అప్పటికే ఆసీస్లో పర్యటించిన ప్రతి జట్టు ఆస్ట్రేలియాతో గులాబి బంతి టెస్టు ఆడాయి. దీంతో టీమిండియా కూడా గులాబి టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదన చేసింది. అయితే సీఏ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఇక బీసీసీఐ అధ్యక్షుడుగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్నాక పలు మార్పులు తీసుకొచ్చాడు. మొదటగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడి డే/నైట్ టెస్టు ఒప్పించి, ఆ తర్వాత బంగ్లాదేశ్ను కూడా ఒప్పించాడు. దీంతో టీమిండియా తొలి డే/నైట్ టెస్టు ఆడింది.
తాజాగా సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ మాట్లాడుతూ... 'వచ్చేడాది జరిగే పర్యటనలో టీమిండియాతో కచ్చితంగా డే/నైట్ టెస్ట్ ఆడతామన్న నమ్మకం ఉంది. టెస్టు ఛాంపియన్షిప్లో కోహ్లీసేన బాగా ఆడుతోంది. పాయింట్ల పట్టికను చూస్తే.. 2021లో ఫైనల్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీమిండియాతో డే/నైట్ టెస్టును షెడ్యూలులో చేర్చడం సులభం. ఫైనల్కు చేరితే మాతో టెస్టుకు టీమిండియా ఒప్పుకోకపోవడంలో అర్థం లేదు' అన్నాడు.
'టీమిండియా తొలి డే/నైట్ టెస్టు ఆడటంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. మూడు రోజుల టికెట్లు ముందుగానే అమ్ముడవ్వడం చూశాం. ఇది క్రికెట్కు ఎంతో మేలు చేస్తుందని బీసీసీఐ అర్థం చేసుకుంది. మరిన్ని గులాబీ టెస్టులు ఆడుతుందని అనుకుంటున్నా. మాతో గులాబి టెస్టును బీసీసీఐ వ్యతిరేకిస్తుందని అనుకోవడం లేదు' అని రాబర్ట్స్ పేర్కొన్నాడు.