క్రికెట్లో అప్పుడప్పుడు వెలుతురు లేకపోవడం లేదా వర్షం కారణంగా మ్యాచ్లు నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ను ఆతిథ్య జట్టు ఎప్పుడూ ఊహించని కారణంతో ఆపాల్సి వచ్చింది. మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు మొదటి సెషన్ సందర్భంగా భూకంపం రావడంతో ఆటను నిలిపివేశారు.
భూకంపం.. ఆందోళనలో ఐర్లాండ్ ఆటగాళ్లు
కామెంటరీ బాక్సులో ఉన్న కామెంటేటర్లు కూడా భూకంపం వచ్చినట్లు ధ్రువీకరించారు. స్టేడియంలో ప్రకంపనలు రావడంతో ఐర్లాండ్ ఆటగాళ్లు వెంటనే తమ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి బౌండరీ లైన్ వద్ద గుమిగూడారు. స్టాండ్స్లో కూర్చున్న ప్రేక్షకులు కూడా కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత ప్రకంపనలు ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

ఆట నిలిచిపోయే సమయానికి ఐర్లాండ్ జట్టు 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉంది. ఆ దశలో స్టీఫెన్ డోహెనీ, లోర్కాన్ టకర్ నిలకడగా ఆడి జట్టు స్కోరును 113 పరుగులకు చేర్చారు. వీరిద్దరూ కలిసి 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది ఐర్లాండ్ జట్టును పతనం అంచు నుంచి కాపాడింది. ఆ తర్వాతే భూకంపం ఢాకాను తాకింది.
బంగ్లాదేశ్ భారీ స్కోరు
రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ సెంచరీలు సాధించడంతో బంగ్లాదేశ్ జట్టు పటిష్టమైన స్థితికి చేరుకుంది. 5 వికెట్లకు 340 పరుగులతో రెండో రోజు ఆటను ముగించిన బంగ్లాదేశ్, మూడో రోజు 476 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ముష్ఫికర్ రహీమ్ తన 13వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాకుండా తన 100వ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన ప్రపంచంలో పదకొండో క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అతను 106 పరుగుల వద్ద ఔటయ్యాడు. లిట్టన్ దాస్ కూడా దూకుడుగా ఆడి, ఒక సిక్సర్, ఒక ఫోర్తో తన సెంచరీని పూర్తి చేశాడు.