న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్ను భారీ మొత్తం చెల్లించి కొన్నంత మాత్రాన ఆయనకు కెప్టెన్సీ ఇవ్వాలని తాము భావించడం లేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్స్టన్ అన్నాడు. యువరాజ్కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయం అనుమానమే అన్నాడు.
కాగా, సోమవారం జరిగిన ఐపీఎల్-8 ఆక్షన్లో యువరాజ్ను ఢిల్లీ రూ.16 కోట్లు వెచ్చించి కొన్న విషయం తెలిసిందే. తాను కిర్స్టన్ నిర్దేశనలో ఆడేందుకు సంతోషిస్తున్నానని యువరాజ్ చెప్పారు.

ఈసారి ఐపీఎల్ వేలంలో మొత్తం 349 మంది క్రికెటర్లు అమ్మకానికి ఉండగా, వారిలో 67 మందిని మాత్రమే వివిధ ఫ్రాంచైజీలు కొన్నాయి. వీరిలో 43 మంది విదేశీయులుకాగా, 24 మంది భారత క్రికెటర్లు. 33 మంది తమతమ దేశాలకు ప్రాతినిథ్యం వహించగా, 34 మంది ఇంకా అంతర్జాతీయ కెరీర్ను మొదలు పెట్టలేదు.
ఎవరూ ఆసక్తి చూపని ఆటగాళ్ల అవకాశాలకు ఇంకా తెరపడలేదు. వారిలో ఎవరినైనా కొనేందుకు ఫ్రాంచైజీలు మళ్లీ బిడ్స్ వేయవచ్చు. ఇంతకు ముందు తాము తిరస్కరించిన ఆటగాళ్లను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
సంగక్కర నుంచి ఆమ్లా వరకూ ఎవరిని రెండో విడతలో అదృష్టం వరిస్తుందో చూడాలి. తప్పక అవకాశం దక్కుతుందనుకుని ఆశించిన ఎంతో మంది క్రికెటర్లకు సోమవారం నాటి వేలం నిరాశనే మిగిల్చింది. వీరిలో స్టార్ ఇమేజ్ ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయతే, తదుపరి బిడ్లోనూ స్టార్లకు అవకాశం దక్కకపోవచ్చు.