అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా వెస్టిండీస్ జట్టులో చోటు కోల్పోయిన స్మిత్.. చివరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2004 జనవరిలో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
కాగా, 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో యూఏఈతో నేపియర్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచులో స్మిత్ చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత విండీస్ వన్డే జట్టులో అతనికి స్థానిక దక్కలేదు. 2006 మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత స్మిత్ టెస్టుల నుంచి తప్పుకున్నాడు.

10 టెస్ట్ మ్యాచ్లు ఆడిన స్మిత్.. 24.61 సగటుతో 320 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 105. ఇక వన్డేల విషయానికొస్తే.. 105 వన్డేలు ఆడిన స్మిత్.. 1560 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 97.
అరంగేట్రంలో టెస్టులో స్మిత్ చేసిన సెంచరీనే అతని తొలి, చివరి సెంచరీ కావడం విశేషం. కాగా, దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 టోర్నమెంట్లలో మాత్రం స్మిత్ ఆడనున్నాడు. ప్రస్తుతం ఈ కరీబియన్ ఆటగాడు 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు.