
హైదరాబాద్: తాజా విజయం అందించినందుకు చెన్నై కెప్టెన్ ధోనీకి బ్రావో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్లో ధోనీ కూర్చుని ఉండగా బ్రావో చిందులు వేసి కెప్టెన్ను అలరించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ద్వారా పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా చెన్నై నిలిచింది. టోర్నీలో భాగంగా జరిగిన మొదటి క్వాలిఫయర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై అనూహ్య విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
దీంతో చెన్నై సూపర్కింగ్స్ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. చివరి వరకు డుప్లెసిస్ ఒంటరి పోరాటం చేసి జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే చెన్నై ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి డుప్లెసిస్ను అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తర్వాత చెన్నై ఆటగాళ్లు తమ డ్రస్సింగ్ రూమ్లోకి వెళ్లారు. ఆనందంతో ఆటగాళ్లంతా సందడిగా గడిపారు.
ఈ క్రమంలో బ్రావో... ధోనీ ఎదుట డ్యాన్స్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా బ్రావోతో పాటు కాలు కదిపాడు. అంతేకాదు డ్రస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు విజయానందంతో చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దాంతో పాటుగా కిచెన్లోనూ చిందులు వేసిన బ్రావో.. జట్టులోని ఆటగాళ్లందరినీ ఉత్సాహపరిచి.. తనదైన స్టైల్లో స్టెప్పులు వేయించాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం ప్లేఆఫ్ రేసులో చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు.