అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగష్టు నెలకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులను ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్ విభాగాల్లో శ్రీలంక ఆటగాళ్లకే అవార్డులు వరించాయి. మెన్స్ క్రికెట్లో యువ ఆల్రౌండర్ దునిత్ వెల్లలాగే, ఉమెన్స్ క్రికెట్లో హర్షిత సమరవిక్రమ విజేతగా నిలిచారు.
టీ20 వరల్డ్ కప్ విజేత భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలవడంలో దునిత్ వెల్లలాగే ప్రధాన పాత్ర పోషించాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఆల్రౌండ్ షోతో సత్తాచాటడంతో 1997 తర్వాత లంక తొలిసారి టీమిండియాపై వన్డే సిరీస్ విజయం సాధించగలిగింది. ఆగష్టు మంత్ అవార్డుకు వెల్లలాగేతో పాటు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వెస్టిండీస్ ప్లేయర్ జేడెన్ సీల్స్ కూడా నామినేట్ అయ్యారు. కానీ వెల్లలాగే విజేతగా నిలిచాడు.

శ్రీలంక పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఇక వన్డే సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. దీంతో లంకపై విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ మూడు వన్డేల సిరీస్లో వెల్లలాగే 108 పరుగులు, ఏడు వికెట్లు పడగొట్టారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెల్లలాగే రెండు సార్లు ఔట్ చేశాడు. రోహిత్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఈ యువ ఆల్రౌండర్ విరాట్ కోహ్లిని కూడా ఒక్కసారి బోల్తాకొట్టించాడు. ఇక తొలి వన్డే టై కావడంలో వెల్లలాగేది కీలకపాత్ర. అతను అజేయంగా 67 పరుగులు చేసి రోహిత్, శుభ్మన్ గిల్ వికెట్లు పడగొట్టాడు. రెండో వన్డేలో 39 పరుగులతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
మూడో వన్డేలో బంతితో చెలరేగాడు. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (5/27) చేశాడు. రోహిత్, కోహ్లి, శ్రేయస్లను పెవిలియన్కు చేర్చాడు. కాగా, 2022 అండర్-19 వరల్డ్ కప్లో శ్రీలంక జట్టును వెల్లలాగే నడిపించాడు. ఇక 2024లో ఐసీసీ మంత్ అవార్డు గెలుచుకున్న రెండో శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది వెల్లలాగే కంటే ముందు కామిందు మెండిస్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. మార్చి నెలలో మెండిస్ విజేతగా నిలిచాడు.