
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్ అనంతరం భారత్తో జరగబోయే మూడు టీ20ల సిరిస్కు ఆతిథ్య దక్షిణాఫ్రికా మంగళవారం జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సెలక్టర్లు అవకాశం కల్పించారు. జోహాన్నెస్బర్గ్లో జరిగిన నాలుగో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్లాసెన్ను టీ20లకూ ఎంపిక చేశారు.
బ్యాట్స్మన్ క్రిస్టియాన్ జోంకర్, ఫాస్ట్ బౌలర్ జూనియర్ డాలాలు ఈ టీ20 సిరిస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ టీ20 జట్టుకు దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు జేపీ డుమిని సారథ్యం వహించనున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.
అనంతరం దక్షిణాఫ్రికా జాతీయ సెలక్షన్ ప్యానెల్ కన్వీనర్ లిండా జోండీ మీడియాతో మాట్లాడుతూ 'భారత్తో టీ20 సిరిస్ ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గత సమ్మర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చాం. హషీం ఆమ్లా, అయిడెన్ మర్క్రమ్లతో పాటు సఫారీ ఫ్రంట్ లైన్ బౌలర్లు ఉన్నారు' అని వివరించాడు.
'గత సమ్మర్లో చాలావరకు క్రికెట్ ఆడని ఏబీ డివిలియర్స్ మాత్రం టీ20 సిరిస్లో పాల్గొంటాడు. 2020లో ఐసీసీ వరల్డ్ కప్ టీ20 టోర్నీ జరగనున్న నేపథ్యంలో తాబ్రిజ్ షంసీ, ఆరోన్ ఫంగిసోలను పరీక్షించనున్నాం. ఈ నేపథ్యంలో వారికి ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాం' అని తెలిపాడు.
ఇటీవల కాలంలో దేశవాళీ టీ20 క్రికెట్లో అద్భుత ఫినిషర్గా పేరు తెచ్చుకున్న క్రిస్టియాన్ జోంకర్తో పాటు ఫాస్ట్ బౌలర్ జూనియర్ డాలాల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారని వెల్లడించాడు. ఇక, హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగో వన్డే సఫారీ విజయంలో కీలకపాత్ర పోషించాడని తెలిపాడు.
భారత్తో టీ20 సిరిస్కు దక్షిణాఫ్రికా జట్టు:
JP Duminy (capt), Farhaan Behardien, Junior Dala, AB de Villiers, Reeza Hendricks Christiaan Jonker, Heinrich Klaasen, David Miller, Chris Morris, Dane Paterson, Aaron Phangiso, Andile Phehlukwayo, Tabraiz Shamsi Jon-Jon Smuts.