దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా జరిగిన ఇండియా-బీ వర్సెస్ ఇండియా-సీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఊహించనట్లుగానే డ్రాగా నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 309/7తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-బీ ఆలౌట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మరో 23 పరుగులే జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (157 నాటౌట్; 286 బంతుల్లో, 14 ఫోర్లు, 1 సిక్సర్) అజేయంగా నిలిచాడు. ఇవాళ ఆటలో రెండు ఫోర్లు బాది 150 మార్క్ను అందుకున్నాడు. కానీ అన్షుల్ కాంబోజ్ దెబ్బకు మరో ఎండ్లో సహచరులు వరుసగా వెనుదిరిగారు. అన్షుల్ ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో 27.5 ఓవర్లు బౌలింగ్ వేసిన అన్షుల్ 69 పరుగులే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 193 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా-సీ ఆఖరి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 93 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో సత్తాచాటాడు. రజత్ పటిదార్ (42; 84 బంతుల్లో, 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్
సెంచరీ హీరో ఇషాన్ కిషాన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (11) నిరాశపరిచాడు. రాహుల్ చాహర్ రెండు, ముకేశ్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో ఇండియా-సీ 525 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (111), మానవ్ సుతార్ (82), ఇంద్రజిత్ (78), రుతురాజ్ గైక్వాడ్ (58) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో నాలుగు వికెట్లు తీశారు. కాగా, దులీప్ ట్రోఫీ పాయింట్ల టేబుల్లో ఇండియా-సీ 9 పాయింట్లతో టాప్లో ఉంది. ఇండియా-బీ 7 పాయింట్లతో, ఇండియా-ఏ 6 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆఖరి స్థానంలో ఉన్న ఇండియా-డీ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు.