అవకాశం కోసం ఎదురుచూడటం, ఎట్టకేలకు దక్కిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకోలేకపోవడం, తిరిగి అవకాశం కోసం వేచి ఉండటం, తర్వాత మరోసారి ఫ్లాప్ అవ్వడం... టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కెరీర్లో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవడం సాధారణమే అన్నట్లుగా ఉంది. ఎట్టకేలకు రెడ్ బాల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన శాంసన్ నిరాశపరిచాడు. చెత్త షాట్కు యత్నించి అయిదు పరుగులకే ఔటయ్యాడు.
అనంతపురం వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డీ తరఫున బరిలోకి దిగిన శాంసన్ ఆరు బంతులే ఎదుర్కొన్నాడు. 44/3తో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అతను పేలవమైన షాట్తో వికెట్ సమర్పించుకున్నాడు. అకిబ్ ఖాన్ వేసిన షాట్ పిచ్ డెలివరీని పుల్ షాట్కు యత్నించి మిడాన్లో ఉన్న ప్రసిధ్ కృష్ణ చేతికి చిక్కాడు.

దీంతో సంజు శాంసన్పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే ప్రతిభకు, అనుభవానికి ఏ మాత్రం లోటు లేని 29 ఏళ్ల శాంసన్ 2015లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటివరకు శాంసన్ కేవలం 16 వన్డేలు, 30 టీ20లు మాత్రమే ఆడాడు. శాంసన్కు సెలక్టర్లు అన్యాయం చేస్తున్నారని గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న వాదన.
మరికొన్నాళ్లలో టీ20 వరల్డ్ కప్ ఉంటే శాంసన్ను వన్డే జట్టుకు ఎంపిక చేస్తారని, అలాగే వన్డే వరల్డ్ కప్ ఉంటే అతన్ని టీ20లకు సెలక్ట్ చేస్తారనే విమర్శలు సెలక్టర్లపై ఉన్నాయి. కాగా, గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు అందుకోవడంతో శాంసన్కు అవకాశాలు మెరుగవుతాయని, అతను టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడని భావించారంతా.
కానీ దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి సంజు శాంసన్ తొలుత ఎంపిక కాలేదు. ఇషాన్ కిషన్కు గాయమవ్వడంతో ఇండియా-డీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి రౌండ్ మ్యాచ్లో తుదిజట్టులో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనూ సంజు శాంసన్ బెంచ్కే పరిమితం అయ్యాడని ట్రోల్స్ వచ్చాయి. మొత్తంగా రెండో రౌండ్లో తుదిజట్టులో అవకాశం దక్కించుకున్నాడు. కానీ రీఎంట్రీలో శాంసన్ నిరాశపరిచాడు.