దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-బీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఓవర్నైట్ స్కోరు 150/6తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-బీ 184 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆకాశ్ దీప్ అయిదు వికెట్లు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగారు. రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. కాగా, ఆఖరి రోజు అయిన ఇవాళ ఆటలో మిగిలిన 78 ఓవర్లలో.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 51 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

మయాంక్ అగర్వాల్ (3; 4 బంతుల్లో), రియాన్ పరాగ్ (31; 18 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఔటయ్యారు. అయితే మయాంక్.. నితీశ్ రెడ్డి అద్బుతమైన క్యాచ్తో ఆదిలోనే వెనుదిరిగాడు. యశ్ దయాల్ వేసిన బంతిని షాట్కు యత్నించిన మయాంక్ సెకండ్ స్లిప్లో ఉన్న నితీశ్కు దొరికాడు. అయితే అది అంత సులువైన క్యాచ్ కాదు. సెకండ్, థర్డ్ స్లిప్ మధ్యలో నుంచి వెళ్తున్న బంతిని నితీశ్ కుడివైపునకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు.
అయితే ఈ క్రమంలో నేలకు బలంగా తాకడంతో బంతి అతని చేతి నుంచి జారింది. వెంటనే నితీశ్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎడమచేతితో బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. కాగా, ఈ అద్భుతమైన క్యాచ్ అందుకున్న నితీశ్ కాసేపటికీ శుభ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేయడం గమనార్హం. నవదీప్ సైని బౌలింగ్లో గిల్ సెకండ్ స్లిప్లో నితీశ్కు దొరికేసేలా కనిపించాడు. కానీ ఈ తెలుగు కుర్రాడు ఈసారి క్యాచ్ను అందుకోలేకపోయాడు.
కాగా, మొదటి ఇన్నింగ్స్లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.