దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బీ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సీ జట్టుకు శుభ్మన్ గిల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఓవర్నైట్ స్కోరు 150/6తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-బీ 184 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ దాటికి బీ జట్టు బ్యాటర్ల పెవిలియన్కు వరుసగా క్యూ కట్టారు. ఆకాశ్ దీప్ అయిదు వికెట్లు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగారు. రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు.

అనంతరం ఆటలో మిగిలిన 78 ఓవర్లలో.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57; 121 బంతుల్లో, 7 ఫోర్లు), ఆకాశ్ దీప్ (43; 42 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడారు. ఛేదన ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (3; 4 బంతుల్లో) వికెట్ కోల్పోయినప్పటికీ శుభ్మన్ గిల్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి రియాన్ పరాగ్ (31; 18 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.
పరాగ్ దూకుడగా స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అయితే పరాగ్ను యశ్ దయాల్ ఔట్ చేసి దెబ్బతీశాడు. కాసేపటికే గిల్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత బీ జట్టు బౌలర్లు చెలరేగడంతో 76 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన రాహుల్ అర్ధశతకం బాదాడు. రాహుల్ క్రీజులో ఉన్నంతసేపు ఏ జట్టు విజయంపై ఆశలు ఉన్నాయి. కానీ రాహుల్ ఔటవ్వడంతో ఓటమి లాంఛనమైంది. అయితే ఆఖర్లో ఆకాశ్ దీప్ అనూహ్య రీతిలో చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. యశ్ దయాల్ మూడు, ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో రెండు వికెట్లు తీశారు.
కాగా, మొదటి ఇన్నింగ్స్లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.