దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బీ ఘన విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో నెగ్గింది. బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సీ జట్టుకు శుభ్మన్ గిల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్నైట్ స్కోరు 150/6తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-బీ 184 పరుగులకే కుప్పకూలింది.
రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. ఆకాశ్ దీప్ అయిదు వికెట్లు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగారు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57; 121 బంతుల్లో, 7 ఫోర్లు), ఆకాశ్ దీప్ (43; 42 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడారు. యశ్ దయాల్ మూడు, ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.
కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలు శుభ్మన్ గిల్ వివరించాడు. తొలి ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్, నవదీప్ సైని కీలక ఇన్నింగ్స్లు కారణంగానే తమ జట్టు ఓటమి పాలైందని పేర్కొన్నాడు. అయితే సైని బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడంతో బౌన్సర్ ఆప్షన్ ఉపయోగించామని చెప్పాడు. కానీ అది అంతగా సఫలం కాలేదని తెలిపాడు.
ఛేదనలో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే విజయాన్ని అందుకోగలమని లంచ్ సమయానికి భావించామని గిల్ అన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో తమ బౌలర్ల ప్రదర్శన గొప్పగా ఉందని గిల్ అభినందించాడు. కాగా, అనంతపురం వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ఇండియా-డీ జట్టుతో ఇండియా-ఏ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.