
దుబాయ్: ఆదివారం (నవంబర్ 14) జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచ్కు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించారు. దాంతో దుబాయ్ స్టేడియం హౌస్ఫుల్ కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకు అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 25,000 సీట్లు అభిమానులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్లను నిర్వహించారు.
అయితే ఫైనల్కు మాత్రం దుబాయి మైదానంలో పూర్తిగా 25 వేల మంది ప్రేక్షకులకు అనుమతించనున్నారు. అయితే కరోనా నిబంధనల మధ్య ఈసీబీ మ్యాచ్ నిర్వహించనుంది. భారత్లో జరగాల్సిన టోర్నీ.. కరోనా కారణంగా యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటికే ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరాయి. బుధవారం (నవంబర్ 10) జరగనున్న తొలి సెమీస్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అబుదాబి మైదానంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక గురువారం (నవంబర్ 11) జరగనున్న రెండో సెమీస్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ మైదానంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. రెండు సెమీఫైనలల్లో గెలిచిన జట్లు నవంబర్ 14న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.
టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ నాకౌట్ చేరకుండానే వెనుదిరిగింది. మెగా టోర్నీ తొలి మ్యాచులో పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం న్యూజీలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన పరాజయం పాలైంది. ఆపై ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్ జట్లపై సునాయాస విజయాలు అందుకుంది. ఇక సోమవారం జరిగిన చివరి సూపర్-12 మ్యాచ్లో నమీబియాపై భారత్ గెలుపొందింది. మెగా టోర్నీలో సూపర్-12 దశలో భారత్ రెండు మ్యాచులు ఓడి.. మూడు మ్యాచుల్లో గెలుపొందింది. అయినా కూడా కోహ్లీసేన సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.