దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. శుక్రవారం డిజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్సర్ సాధించి నెగ్గింది. క్యాపిటల్స్ తరఫున జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా (60*; 45 బంతుల్లో 5×4, 2×6) వీరోచిత ఇన్నింగ్ ఆడాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన డిజర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్ (26; 11 బంతుల్లో 4×4, 1×6), హాలెస్ (66; 37 బంతుల్లో 4×4, 6×6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. 4.2 ఓవర్లలోనే తొలి వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డౌన్లో వచ్చిన లారెన్స్ (15; 11 బంతుల్లో) కలిసి హాలెస్ అదే జోరును కొనసాగించడంతో 8 ఓవర్లలోనే డిజర్ట్ వైపర్స్ 100 పరుగులు చేసింది.

కానీ తర్వాత దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లు పుంజుకోవడంతో చివరి 12 ఓవర్లలో వైపర్స్ జట్టు కేవలం 71 పరుగులే చేయడం గమనార్హం.వరుసగా వికెట్లు కోల్పోతూ రన్రేట్ను క్రమంగా తగ్గించుకుంది. దుబాయ్ బౌలర్లలో ఓలీ స్టెన్, వాండర్ మెర్వే చెరో రెండు వికెట్లు తీశారు. సికిందర్ రజా నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ అయిదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. అయితే దుబాయ్కు పేలవమైన ఆరంభం లభించింది. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన సికిందర్.. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (57; 36 బంతుల్లో 5×4, 2×6)తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే కీలక సమయంలో దుబాయ్ వికెట్లు కోల్పోయింది.
ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. అలీ నజీర్ బౌలింగ్ వేశాడు. తొలి బంతి స్కాట్ బ్యాటుకు ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫోర్ లభించింది. రెండో బంతికి పరుగు రాలేదు. మూడో బంతికి స్కాట్ సింగిల్ తీసి స్ట్రైకింగ్ సికిందర్కు ఇచ్చాడు. అయితే నాలుగో బంతికి రెండు పరుగులు రాగా, అయిదో బంతికి పరుగేమి లభించలేదు. దీంతో విజయానికి ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అలీ వేసిన స్లో కట్టర్ను లాంగాఫ్ మీదుగా సికిందర్ సిక్సర్ బాదాడు.