Viral Video: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ను కోల్పోయిన తరుణంలో ఆ జట్టు బ్యాటర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ చేసిన పనులు ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ఇరకాటంలో పడేశాయి. వారికి సంబంధించిన కొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఈ దుమారానికి కారణం
అసలేం జరిగిందంటే?
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరాజయాల అనంతరం ఆటగాళ్లకు ఇచ్చిన విరామ సమయంలో వీరు నైట్ క్లబ్లలో పార్టీలు చేసుకుంటూ కెమెరాకు చిక్కారు. ఓ వీడియోలో బెన్ డకెట్ పూర్తిగా మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన హోటల్ గదిని కూడా వెతుక్కోలేని స్థితిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఆయనను ఆటపట్టిస్తూ 'ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్లడానికి క్యాబ్ కావాలా?' అని అడగడం ఆ వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ఓ నైట్ క్లబ్లో గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. ఈ-సిగరెట్ తాగుతూ కనిపించారు.

కీలక యాషెస్ సిరీస్ జరుగుతున్న సమయంలో జట్టు ఓడిపోతున్నా ఆటగాళ్లు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా పార్టీల్లో మునిగితేలడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
ఈ వ్యవహారంపై ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. "మా ఆటగాళ్లు అతిగా మద్యం సేవించారనే వార్తలు నిజమైతే, ఖచ్చితంగా మేము దానిని సమీక్షిస్తాం. ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు." అని రాబ్ కీ పేర్కొన్నారు. అయితే సుదీర్ఘ పర్యటనల వల్ల కలిగే అలసటను దూరం చేసుకోవడానికి ఆటగాళ్లకు బ్రేక్ ఇచ్చామని.. కానీ దానిని దుర్వినియోగం చేయడం సరికాదని బోర్డు అభిప్రాయపడుతోంది. మరి ఈ వివాదం ఇంగ్లాండ్ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.