జొహానెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 1-1తో సౌతాఫ్రికాతో కలిసి అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో డీఆర్ఎస్ పనిచేయలేదు. దాంతో మిల్లర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(35) టాప్ స్కోరర్. అయితే మిల్లర్ తొమ్మిదో ఓవర్లోనే ఔట్ అవ్వాల్సి ఉంది. జడేజా వేసిన బంతిని మిల్లర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది బ్యాట్కు తాకి వికెట్కీపర్ చేతుల్లోకి వెళ్లింది. టీమిండియా అపీల్ చేయగా.. అంపైర్లు డీఆర్ఎస్ అందుబాటులో లేదని, టెక్నికల్ సమస్య ఉందని తెలిపారు. దాంతో టీమిండియా రివ్యూ కూడా అడగలేకపోయింది. మిల్లర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు.
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇది గల్లీ క్రికెట్ కాదని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆ టైమ్ లో డగౌట్ ఉన్న సూర్యకుమార్.. అసలేం జరుగుతుందంటూ కోపంగా రియాక్ట్ అయ్యాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవల దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సౌతాఫ్రికా బోర్డును విమర్శించిన సంగతి తెలిసిందే. మైదానాన్ని పూర్తిగా కవర్స్ కప్పి ఉంచనందకు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.