

హైదరాబాద్: డీఆర్ఎస్ విధానంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు అనుగుణంగా ఆటగాడు డీఆర్ఎస్ కోరినప్పటికీ, దానిని ఫీల్డ్ అంఫైర్ తిరస్కరించడం ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశమైంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... డర్బన్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు సఫారీలను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్లోనే సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో హషీమ్ ఆమ్లాను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఎల్బీ కోసం ఫెర్నాండో అప్పీల్ చేయగా ఫీల్డ్ అంఫైర్ అలీమ్ ధార్ దానిని తిరస్కరించాడు. బౌలర్, ఇతర ఆటగాళ్లతో చర్చించాక శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె డీఆర్ఎస్ కోరాడు. అయితే, అప్పటికే సమయం మించిపోయిందన్న కారణంతో ధార్ రివ్యూకు ఒప్పుకోలేదు. ఒకవేళ అతడు సమీక్షకు అంగీకరించివుంటే దక్షిణాఫ్రికా 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయేది.
ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి డెడ్ అయ్యాక 15 సెకన్లలోపు సమీక్ష కోరాలి. 10 సెకన్లు ముగిశాక బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ సంబంధిత ఆటగాడికి సమయాన్ని గుర్తు చేయాలి. కానీ, అలీమ్ ధార్ ఎలాంటి హెచ్చరిక చేయకపోవడం... శ్రీలంక కెప్టెన్ నిర్ణీత సమయంలో అప్పీల్ చేసినా తిరస్కరించడం ఇప్పుడు వివాదమైంది.