హైదరాబాద్: ద్రవిడ్ ముందు రెండు ఛాయిస్లు ఉంచితే అండర్ 19 జట్టుకు కోచ్గా ఉండేందుకే సమ్మతించారట. ఈ విషయాన్ని పరిపాలక కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్ వెల్లడించారు. విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చినప్పుడు రాహుల్ ద్రవిడ్ ముందున్న వాటిలో అండర్-19 జట్టుకి కోచ్గా ఉండేందుకు అంగీకరించారట. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో లోధా కమిటీ సంస్కరణ అమలు కోసం సుప్రీంకోర్టు ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్లో ఓ జట్టుకి కోచ్గా ఉంటూ.. భారత అండర్-19 జట్టుకి కూడా రాహుల్ ద్రవిడ్ కోచ్గా పనిచేయడం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని గత ఏడాది పెద్ద ఎత్తున చర్చని లేవనెత్తారు. దీంతో.. అతను అండర్-19 జట్టుకి మాత్రమే కోచ్గా ఉండేందుకు ఒప్పుకున్నట్లు రాయ్ వెల్లడించారు. అలా ఆ వివాదం సద్దుమణిగేందుకు ద్రవిడ్ చక్కటి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
'రాహుల్ ద్రవిడ్కి అప్పట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చాం. అందులో ఒకటి.. ఐపీఎల్లో కోచ్గా కొనసాగడం. రెండోది భారత అండర్-19 జట్టుకి కోచ్గా ఏడాదికాలం కాంట్రాక్ట్. ఆ సమయంలో ద్రవిడ్ మరో ఆలోచన లేకుండా అండర్-19 టీమ్తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. అలా పనిచేసేందుకు అమోదయోగ్యమైన ప్యాకేజీని కోరాడు' అని వినోద్ రాయ్ వివరించారు.
భారత్లో మాత్రమే విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంటోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఆసీస్ జట్టుకి సహాయ కోచ్గా, బిగ్బాష్ లీగ్లో కామెంటేటర్గా, ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కి కూడా పనిచేస్తున్నాడు. కానీ, ఆ దేశ క్రికెట్ బోర్డు ఏ మాత్రం చలించలేదు.