హైదరాబాద్: సిరాజ్ మునుపటి కంటే మరింత మెరుగయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్మన్, అండర్ 19 జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు. అతనితో పాటుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తెలుపు బంతితో విశేషంగా రాణించిన మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఎరుపు బంతి క్రికెట్ ఎక్కువ ఆడితే సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం వస్తుందని భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ను ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. దక్షిణాఫ్రికా-ఏతో అనధికార మ్యాచ్లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 10 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. 'పరిణతి అనేది ఒకటుంది. ఇంగ్లాండ్లో గత మూడునాలుగు మ్యాచుల్లో అతడి ప్రదర్శన దుర్భేద్యంగా ఉంది. దాదాపు 26 వికెట్లు తీశాడు. మానసికంగా, శారీరకంగానూ దృఢంగా మారుతున్నాడు.
అండర్-17, అండర్-19లో సిరాజ్కు తగినంత అనుభవం లేదు. వ్యవస్థకు దూరంగా ఉన్నాడు. 17, 18 ఫస్ట్క్లాస్ మ్యాచ్లే ఆడాడు. కొన్ని ఐపీఎల్ మ్యాచ్లాడిన అనుభవం ఉంది. అతను ఎంత ఎక్కువగా క్రికెట్ ఆడితే అన్ని ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
'చాహల్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు. అతడు సుదీర్ఘ క్రికెట్ ఆడకపోవడంతో ఎరుపు బంతితో ఎలా రాణిస్తాడో చూడాలనుకున్నారు. అందుకే మేం అతడికి కొన్ని అవకాశాలు ఇచ్చాం. ఇది బాగా పనిచేసింది. చాహల్ ఎక్కువగా ఎరుపు బంతితో క్రికెట్ ఆడితే మరింత అనుభవం వస్తుంది. అతడికి చాలా నైపుణ్యాలు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కావాల్సిందల్లా ఎక్కువ మ్యాచ్లు ఆడటం' అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. గతంలో చాహల్ తెలుపు బంతి క్రికెట్లో భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియాలో అదరగొట్టాడు.