
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలలకు పైగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఇప్పటికే తాత్కాలికంగా రద్దు కాగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ నిర్వాహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమే అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు అనుష్మాన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు.
అనుష్మాన్ గైక్వాడ్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగుతుందని నాకు అస్సలు అనిపించడం లేదు. మరోవైపు ఐపీఎల్ 2020 గురించి ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై ఆధారపడి ఉంది. కానీ ఐపీఎల్కి సరైన సమయం మాత్రం అక్టోబర్-నవంబర్ అనే నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రపంచకప్ రద్దయినా లేదా వాయిదా పడినా.. ఐపీఎల్ జరిగేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉంది. ప్రపంచకప్ విండోలో ఐపీఎల్ నిర్వహించుకోవచ్చు' అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం 16 జట్లు ఆస్టేలియాకు రావాల్సి ఉంటుంది. ప్రయాణం, తదితర విషయాల్లో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి మెగా టోర్నీని ఏకంగా 2022కి మార్చే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉందని సమాచారం తెలుస్తోంది. ఈనెల 28న ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనుండగా.. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారట. ముఖ్యంగా టోర్నీ వాయిదాపైనే ప్రధాన చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలో అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాలి. క్రికెట్ కార్యకలాపాలు పుంజుకునే క్రమంలో టోర్నీ నిర్వహణపై మూడు అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే.. 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తూ ప్రేక్షకులను కూడా అనుమతించడం మొదటి అవకాశం. ఖాళీ స్టేడియాల్లో టోర్నీని జరపడం రెండోది. 2022కి టోర్నీని మార్చడం మూడోది. ఈ మూడు ప్రత్యమ్నాయాలను బోర్డు మీటింగ్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రయాణ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీని ఇప్పుడు జరపకపోవడం అటు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు కూడా మేలు చేస్తుందని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఇక టోర్నీని రెండేళ్లకు వాయిదా వేయడంపై కూడా ఆతిథ్య ఆస్ట్రేలియాకు కూడా అంతగా అభ్యంతరం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ కన్నా ద్వైపాక్షిక సిరీస్ వైపే మొగ్గు చూపనున్నట్లు సమాచారం.