
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి డబుల్ షాక్ తగిలింది. భద్రతా కారణాలతో ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. తాజాగా ఇంగ్లండ్ టీమ్ కూడా కివీస్ బాటలోనే నడిచింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే సిరీస్ను ఇంగ్లండ్ రద్దు చేసుకుంది. పురుషులతో పాటు మహిళల జట్టు కూడా పాక్ టూర్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. న్యూజిలాండ్ పర్యటన రద్దు అయిన మూడు రోజులకే ఇంగ్లండ్ కూడా తన టూర్ను రద్దుచేసుకోవడంతో పీసీబీ పెద్దలకు కి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.
'ఈ వారాంతంలో పాకిస్థాన్లో ఇంగ్లండ్ మహిళలతో పాటు పురుషుల పర్యటన గురించి చర్చించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమావేశమైంది. అక్టోబర్ మాసంలో జరిగే పర్యటనను ఉపసంహరించుకోవాలని బోర్డు అయిష్టంగానే నిర్ణయించింది. ఏదేమైనా మాకు ప్లేయర్స్, సహాయక సిబ్బంది భద్రతే ముఖ్యం. మా మొదటి ప్రాధాన్యత కూడా అదే. ఈ నిర్ణయం క్లిష్టమైనదే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేము' అని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్ పురుషుల జట్లు అక్టోబర్ 13, 14 తేదీలలో రావల్పిండిలో రెండు టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మహిళల జట్టు అక్టోబర్ 17, 19 21 తేదీలలో మూడు మ్యాచ్ల వన్డే మ్యాచుల సిరీస్లో పాల్గొనాల్సి ఉంది.
'పాకిస్తాన్కు వెళ్లడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో బయో బబుల్లో ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. వారు మానసిక ఒత్తిడికి కూడా గురవుతన్నారు. రానున్న సిరీస్ల కోసం ఆటగాళ్లను మరింత ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి ఆతిథ్యమివ్వడానికి కృషి చేసిన పీసీబీకి ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తుంది. ఇది పాకిస్తాన్లో క్రికెట్పై ప్రభావం చూపుతున్నందుకు ఎంతో చింతిస్తున్నాం. 2022 కోసం మా ప్రధాన పర్యటనలపై ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నాం' అని ఈసీబీ అధికారి పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా నిరాశ వ్యక్తం చేశాడు. 'ఇంగ్లండ్ నిర్ణయంతో నిరాశ చెందా' అని ట్వీట్ చేశాడు.
రావల్పిండిలో శుక్రవారం వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ టీమ్ తన టూర్ను రద్దు చేసుకుంది. దీంతో పాక్ గడ్డ 2003 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అవుతుందనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా తన పర్యటనను రద్దు చేసుకుని మరో షాక్ ఇచ్చింది. 2009 లో లాహోర్లో శ్రీలంక టీమ్ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటు ఇద్దరు సామాన్య ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అన్ని జట్లు పాకిస్తాన్లో పర్యటించడానికి వణికిపోతున్నాయి.