దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఓటమిపై మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. అనుభవం ఉన్న సీనియర్లు జట్టులో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. షమి, రహానె, పుజారా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
అయితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు బదులుగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రెండో టెస్టు తుది జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లుగా ఇద్దరూ సత్తాచాటుతారని, కానీ జడేజా ఏడో స్థానంలో జట్టుకు విలువైన పరుగులు జతచేస్తాడని అన్నాడు.

జడేజా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అశ్విన్ను తొలి టెస్టులో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టులో అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఎనిమిది పరుగులే చేశాడు.
'' రవీంద్ర జడేజా ఫిట్గా ఉంటే అతడు తిరిగి జట్టులోకి రావాలి. అయితే ఓ బౌలర్ నుంచి ఏం ఆశిస్తామో అశ్విన్ అది పక్కాగా చేయగలడు. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే జడేజా లేని లోటు సెంచూరియన్ టెస్టులో స్పష్టంగా కనిపించింది. ఇక మిగిలిన బౌలర్ల విషయానికొస్తే.. రోహిత్ శర్మ అదే బౌలింగ్ దళాన్ని రెండో టెస్టులో కూడా తీసుకోవచ్చు. అది మంచి నిర్ణయమే. కానీ జట్టులో మార్పులు చేయాలనుకుంటే ప్రసిధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్ను తీసుకోండి. ఒకవేళ నెట్స్లో ప్రసిధ్ నమ్మకంతో సత్తాచాటుతుంటే అతడినే కొనసాగించండి'' అని ఇర్ఫాన్ అన్నాడు.
తొలి టెస్టులో ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ విఫలమయ్యారు. వీరిద్దరు చెరో వికెట్ తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్ 5.30, ప్రసిధ్ 4.70 ఎకానమీతో బౌలింగ్ చేశారు. కాగా, కేప్టౌన్ వేదికగా జనవరి 3వ తేదీ నుంచి రెండో టెస్టు జరగనుంది.