అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఇంగ్లిష్ జట్టుతో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ తలపడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో టాప్-2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. మరోవైపు సొంతగడ్డపై భారత్ను ఓడించడం ఏ జట్టుకైనా కష్టతరమే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీలు కీలక సూచనలు చేస్తున్నారు.
అయితే టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లితో ఎట్టిపరిస్థితుల్లో మాటల యుద్ధం చేయొద్దని ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఆ జట్టు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సూచించాడు. పొరపాటున అతడిని కవ్వించినా తమ జట్టుకే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. '' విరాట్ కోహ్లితో ఏమీ మాట్లాడొద్దని గతంలో మాకు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే కోహ్లి ఆ తర్వాత మైదానంలో ఓ యుద్ధమే చేస్తాడు. పైగా దాన్ని అతడు ఆనందిస్తాడు''

''గతంలో స్టీవెన్ ఫిన్ బౌలింగ్లో కోహ్లి అద్భుతమైన షాట్లతో బౌండరీలు సాధించాడు. తర్వాత కోహ్లిని స్టీవెన్ కవ్వించేలా యత్నించాడు. దీంతో కోహ్లి పులిలా గర్జించాడు. మైదానం నలుమూలలా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. స్టీవెన్ రెట్టింపుగా నష్టపోయాడు. అయితే అప్పటివరకు విరాట్ వైట్ బాల్ క్రికెట్లోనే తన పరాక్రమం చూపించాడు. టెస్టుల్లో అతడి సత్తానూ ఎవరూ ఊహించలేదు'' అని గ్రేమ్ స్వాన్ అన్నాడు.
టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారాను గ్రేమ్ స్వాన్ను కొనియాడాడు. ఫుట్వర్క్ గొప్పగా ఉండే పుజారాకు బౌలింగ్ చేయడం తనకి ఇష్టంలేదని, అంతంటి నైపుణ్య ఆటగాడు పుజారా అని పేర్కొన్నాడు. భారత్ పిచ్ల గురించి తనకి దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కొన్ని సలహాలు ఇచ్చాడని స్వాన్ చెప్పాడు. ''తొలి ఇన్నింగ్స్లో పిచ్ స్పిన్కు ఆశించినంత సహకరించిందని, కాబట్టి బంతిని వీలైనంత తిప్పడానికి ప్రయత్నించాలని వార్న్ చెప్పాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో పిచ్ గొప్పగా సహకరిస్తుందని భావించి బంతులు సంధించండి. విజయవంతం అవుతారు'' అని అన్నాడు.
కాగా, జనవరి 25న ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. చివరి మూడు టెస్టులు రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.