మానసిక ఒత్తిడి కారణంగా జట్టు నుంచి దూరమైన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. ఇషాన్ త్వరలోనే భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐని విశ్రాంతి కావాలని కోరిన ఇషాన్కు దక్షిణాఫ్రికా పర్యటనలో అనుమతి లభించిన విషయం తెలిసిందే.
అయితే సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇషాన్ దుబాయ్ పార్టీలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక బీసీసీఐ అనుమతి లేకుండా 'కౌన్ బనేగా కరోడ్పతి' టీవీ షోలో పాల్గొనడటంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు ఈ కారణాలతోనే అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్ను ఎంపిక కాలేదని కథనాలు వచ్చాయి. అయితే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అవన్నీ అవాస్తమని కొట్టిపారేశాడు.

ఇషాన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అయితే మానసిక ఒత్తిడి కారణంగా దూరమైన ఇషాన్ దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి టీమిండియాలోకి రావాల్సి ఉంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అందుకే అఫ్గానిస్థాన్ సిరీస్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే ఇషాన్ కిషన్ రంజీట్రోఫీలో పాల్గొనడానికి సిద్ధంగా లేడు. దేశవాళీ క్రికెట్ ఆడే విషయంపై తమ బోర్డుతో ఇషాన్ సంప్రదించలేదని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
దీంతో అతడి రీఎంట్రీపై సందేహాలు పెరిగాయి. దేశవాళీ క్రికెట్లో ఫామ్ను నిరూపించకపోవడంతో ఇంగ్లాండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు ఇషాన్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కేఎస్ భరత్తో ధ్రువ్ జురెల్ను వికెట్ కీపర్లుగా సెలక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. ఇషాన్ గురించి వాస్తవాలు రాయాలని, అతడి కెరీర్ను నాశనం చేసేలా వదంతులు రాయకూడదని మీడియాను కోరాడు.
''సౌతాఫ్రికా టూర్ నుంచి స్వదేశానికి వెళ్తానని అనుమతి తీసుకున్న ఇషాన్ కిషన్ తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే విషయం గురించి ఎవరికీ తెలియదు. అయితే రాహుల్ ద్రవిడ్ చాలా స్పష్టంగా చెప్పాడు. క్రమశిక్షణ చర్యల కారణంగా ఇషాన్ దూరమయ్యాడని వస్తున్న వందతులను ఖండించాడు. రంజీ ట్రోఫీలో అతడు సత్తాచాటి తిరిగి సెలక్టర్ల దృష్టిలో పడాలని చెప్పాడు. అందుకే ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు అతడు ఎంపికకాలేదు''
''కాబట్టి అతడి పేరును చెడగొట్టే వార్తలు ఇప్పుడైనా సద్దుమణుగుతాయని ఆశిస్తున్నా. ఊహాగానాలతో ఆ యువకుడి గురించి వార్తలు రాయకుండా, వాస్తవాలు తెలియజేసే బాధ్యత మీడియాకు ఉంది. ఇషాన్ కిషన్కు అరుదైన ప్రతిభ ఉంది. ఇషాన్ తిరిగొచ్చి పరుగులు సాధించేలా అతడికి టీమిండియా ఫ్యాన్స్ మద్దతు ఇవ్వాలి'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ ఉప్పల్ వేదికగానే జరగనుంది. అయితే తొలి రెండు టెస్టులకు మాత్రమే టీమిండియాను ప్రకటించారు. చివరి మూడు టెస్టులకు ఆటగాళ్లను ఇంకా ఎంపిక చేయలేదు.
తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్